జమ్మికుంట ‘అన్నపూర్ణ సేవా సమితి’కి ప్రతిష్టాత్మక తెలంగాణ స్ఫూర్తి నంది అవార్డు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 13: జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘అన్నపూర్ణ సేవా సమితి’కి అరుదైన గౌరవం దక్కింది. సేవా సమితి అందిస్తున్న విశేష సేవలను గుర్తించిన జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ‘తెలుగు వెలుగు సాహితీ వేదిక’, ‘ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ‘కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ వారు సంయుక్తంగా ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక ‘తెలంగాణ స్ఫూర్తి నంది అవార్డు’ను అందజేశారు. వరంగల్ లోని టీఎన్జీవోస్ భవనంలో ఘనంగా జరిగిన పురస్కార ప్రదానోత్సవ వేదికపై అన్నపూర్ణ సేవా సమితి ప్రతినిధులు ఈ అవార్డును స్వీకరించారు. భక్తులు, దాతల ఆర్థిక సహాయ సహకారాలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా గత నాలుగేళ్లుగా నిరుపేదలకు, భక్తులకు చేస్తున్న అన్న వితరణను ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు. ఈ అవార్డు రావడంపై అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పురస్కారాన్ని ఒక గొప్ప స్ఫూర్తిగా భావిస్తున్నామని, ఇది తమపై బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్నదానంతో పాటు సమాజ హితం కోరే మరిన్ని అనేక రకాల సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని వెల్లడించారు. తాము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి ఇంతటి గుర్తింపు రావడం సంతోషంగా ఉందని, దాతల సహకారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత మందికి సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతామని సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

