వరంగల్లో అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడినీ పరామర్శించనున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
వరంగల్, వి90 న్యూస్, జూన్ 16: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హనుమకొండలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడిని ఆయన స్వయంగా కలవనున్నారు. తనను కలవాలన్నదే ఆ బాలుడి చివరి కోరికగా తెలియడంతో, పవన్ కల్యాణ్ మానవత్వంతో స్పందించి అతని నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు. అలాగే ఆ కుటుంబానికి అవసరమైన ఆర్థిక లేదా వైద్య సహాయం అందించడంపై కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక హనుమకొండలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక బాలుడి కోరికను మన్నించి పవన్ కల్యాణ్ స్వయంగా వస్తుండటం పట్ల జనసేన కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనలో స్థానిక జనసేన నేతలు, ముఖ్య కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు.

