హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు భారీగా నిధులు.. ఎస్టీపీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 17: హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మురుగునీటి శుద్ధీకరణ కర్మాగారాల (ఎస్టీపీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయగా, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఈ వివరాలను వెల్లడించారు. పట్టణాల నుండి నిత్యం వెలువడుతున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు గానూ ప్రభుత్వం రూ. 45 కోట్ల భారీ నిధులను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు.

ఇందులో భాగంగా హుజురాబాద్ మున్సిపాలిటీకి రెండు, జమ్మికుంట మున్సిపాలిటీకి ఒక మురుగునీటి శుద్ధీకరణ కర్మాగారాన్ని కేటాయించినట్లు తెలిపారు.స్థానికంగా ఉన్న మురుగునీటి సమస్య తీవ్రతను, ఇక్కడి పరిస్థితులను అధికారుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వొడితల ప్రణవ్ ప్రత్యేకంగా తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, తక్షణమే నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ప్రణవ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో నెలకొన్న ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు ఈ కీలకమైన ప్రాజెక్టును కేటాయించినందుకు గానూ నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.

