ఉరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
10 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పాత మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం
నాగర్కర్నూల్,వి90 న్యూస్,జూలై 04: ఉరుకొండపేట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి గ్రామానికి రావడంతో ఉరుకొండపేటలో పండగ వాతావరణం, తీవ్ర కోలాహలం నెలకొంది.

తన రాజకీయ ప్రస్థానంలో సరిగ్గా 20 ఏళ్ల క్రితం జెడ్పీటీసీగా ఎన్నికైన నాటి మరిచిపోలేని తీపి గుర్తులతో గ్రామంలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రికి ఆత్మీయులు, ఆనాటి పెద్దలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం, రేవంత్ రెడ్డి ఆనాటి తన రాజకీయ సహచరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఆలయ ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంతో అప్యాయంగా అలనాటి తోటి మిత్రులను పలకరించారు. ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ, వారి బాగోగులు అడిగి తెలుసుకుంటూ పాత అనుభవాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు మిత్రులు 20 ఏళ్ల కిందట ఆయనతో కలిసి దిగిన ఫోటోలను చూపించడంతో ముఖ్యమంత్రి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ అపురూప వేడుకలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు , ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

