రాష్ట్రంలో 2 లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు: మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త
హైదరాబాద్,వి90న్యూస్,జూలై 06: తెలంగాణ రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక పెద్ద శుభవార్త అందించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు జారీ చేయబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల సమాజంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు ఎంతో అవసరమైన ఆర్థిక భరోసా , సామాజిక రక్షణ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం లబ్ధి పొందుతున్న వారిలో ఉన్న అనర్హులను గుర్తించి వారి పేర్లను తొలగించనున్నారు. అలా మిగిలిన నిధులను , అవకాశాలను నిజమైన పేదలు, అర్హులైన కొత్త లబ్ధిదారులకు బదిలీ చేయాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అర్హులైన ఒంటరి మహిళలందరికీ కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగనుంది.

