ముఖ్యమంత్రితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ భేటీ: విద్యా రంగ సంస్కరణలు, ఎస్సీ సంక్షేమ చర్యల వివరణ

0
FB_IMG_1783956134650

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 13: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ సభ్యులతో కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి తో వారు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం, విద్యా రంగంలో ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యా రంగంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. ప్రధానంగా విద్యార్థుల మధ్య చిన్ననాటి నుంచే కుల వివక్షను పూర్తిగా దూరం చేసేందుకు రాష్ట్రంలో కీలక చర్యలు చేపట్టామని తెలిపారు. అందుకోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక వసతులతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ (YIIRS) నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా పనులు చేస్తున్నామని చెప్పారు. దీనితో పాటు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ స్కూల్స్‌లోనే విద్యార్థులకు ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించడంతో పాటు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించామని, మొదటగా కోర్ అర్బన్ రీజియన్‌ పరిధిలో వీలైనన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నట్టు కమిషన్‌కు వివరించారు.

రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి, జనాభా శాతం కంటే ఎక్కువగానే వారికి రాజకీయాల్లో, ఇతర కీలక రంగాల్లో ఉన్నత అవకాశాలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణను పూర్తి చేసి, విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల మరింత సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయ సహకారాలు అందేలా జాతీయ కమిషన్ చొరవ చూపాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు.ఉన్నత స్థాయి వర్గాల సమక్షంలో జరిగిన ఈ కీలక సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , డీజీపీ సీవీ ఆనంద్ , జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతినిధులు , రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed