పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా
డిల్లీ,వి90 న్యూస్,జూలై 24: దేశవ్యాప్తంగా వివిధ పోటీ, నియామక పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర కేబినెట్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పేపర్ లీకేజీ అక్రమాలకు స్వస్తి పలికేలా రూపొందించిన కొత్త చట్ట సవరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ చట్టపరమైన సవరణల ప్రకారం పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఏకంగా రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించే కఠిన నిబంధనలను పొందుపరిచారు. నిరుద్యోగ యువత ప్రయోజనాలను కాపాడటంతో పాటు విద్యా, ఉద్యోగ నియామక వ్యవస్థలపై విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక ప్రధాన ముందడుగుగా నిలవనుంది.

