కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ నాటకాలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర విమర్శలు
హైదరాబాద్,వి90న్యూస్,జూలై 06: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజల ముందు రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు.ఇదే సమయంలో హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒకవైపు పేదల ఇళ్లను కూల్చివేస్తూ, మరోవైపు ఎంఐఎం (MIM) పార్టీకి చెందిన అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ రకమైన పక్షపాత వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

