నీటి సంరక్షణతోనే మన భవిష్యత్తుకు రక్షణ
మున్సిపల్ కార్యాలయంలో ‘జల ప్రతిజ్ఞ’ చేసిన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 13: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నీటి రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కార్యాలయ సిబ్బందితో కలిసి ‘జల ప్రతిజ్ఞ’ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నీటిని అమూల్యమైన వనరుగా భావించి పొదుపుగా, తెలివిగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. నీటి వృధాను అరికడుతూ, ప్రతి బొట్టునూ సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల్ శక్తి అభియాన్: వర్షాన్ని పట్టుకోండి’ (క్యాచ్ ది రెయిన్) ప్రచారానికి తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.

నీటి సంరక్షణపై తనతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారిలో అవగాహన కల్పిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేశారు. భూమిని కాపాడుకుంటూ మన భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి జల ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ఉద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణ ప్రజలందరూ నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, టీపీఓ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, వివిధ వార్డుల అధికారులు , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

