పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి భరోసా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,జూలై 28: వీణవంక మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వేలాది పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు కొండంత ఆర్థిక భరోసాగా నిలిచాయని, వీటి ద్వారా నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన సహాయం అందిందని పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. లబ్ధిదారులకు చెక్కులను సకాలంలో అందజేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు తులం బంగారం కూడా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. వీణవంక, జమ్మికుంట ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం పెండింగ్లో ఉన్న కా ల్వల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసి హుజూరాబాద్ నియోజకవర్గానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు, మహిళలు, పేదల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత అని, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

