ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: ఓటరు జాబితా నమోదుపై కాంగ్రెస్ నాయకుడు దేశిని కోటి పిలుపు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 28: రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు జాబితా నమోదు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, పోలింగ్ బూత్ల పరిధిలో ఒక్క అర్హులైన ఓటరు పేరు కూడా మిస్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేశిని కోటి స్పష్టం చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 19, 4వ వార్డులకు చెందిన పోలింగ్ బూత్ల స్థాయి అధికారులతో (బీఎల్ఓలు) , కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లతో (బీఎల్ఏలు) ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వార్డుల పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా సమగ్రంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు.

కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలో ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు ఉంటే వాటిని వెంటనే సవరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి చిన్న పొరపాట్లకు కూడా తావు ఇవ్వకుండా బీఎల్ఓలు, బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో పరస్పరం సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు బూత్ అధ్యక్షులు మడిపోజు రాజేష్, ఆడెపు దేవరాజ్, శివలతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

