మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో 38 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 31: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ కౌన్సిల్ మీటింగ్లో ప్రవేశపెట్టిన 38 అభివృద్ధి, మౌలిక వసతుల అంశాలను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ కార్యాలయ వాహనాల మరమ్మతులు, శ్రీరామ హాస్పిటల్ నుండి హోటల్ నరసయ్య ఇంటి వరకు డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణం వంటి పనులకు ఆమోదం తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు ఉండే చోట ఆర్సిసి పైపుల కొనుగోలు, లీకేజీల అరికట్టడం, వాల్వ్ రిపేర్లు, బ్లేడ్ ట్రాక్టర్, జెసిబి, లాడర్ మరమ్మతుల ప్రక్రియలకు పచ్చజెండా ఊపారు.

రాబోయే వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్ల కిరాయి, జనరేటర్, టెంట్, స్టేజ్ ఏర్పాట్లతో పాటు పట్టణంలోని రోడ్లపై గుంతలను పూడ్చడానికి సమావేశం ఆమోదం తెలిపింది. మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలు, ఇంటర్ఫోన్ కనెక్షన్లు, టీవీల ఏర్పాటుకు, గాంధీ చౌక్లోని జాతీయ జెండా పోల్ మరమ్మతులు చేసి జెండా ఆవిష్కరణ నిర్వహించేందుకు లక్ష రూపాయల నిధులను కౌన్సిల్ ఆమోదించింది. వీధి దీపాల నిర్వహణ కొరకు పిసిబిఎస్ సెన్సార్లు, డ్రైవర్లు, ఎల్ఈడీ లైట్లు, ఇతర సామాగ్రి కొనుగోలుకు 10 లక్షల రూపాయలు, పట్టణ అభివృద్ధిలో భాగంగా మొక్కల కొనుగోలు, డ్రైనేజీల నిర్మాణాలకు సభ్యులు ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జావిద్, మున్సిపల్ కౌన్సిలర్లు, మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ వికాస్, జేఏఓ రాజశేఖర్ రెడ్డి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

