పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ తీవ్ర సంతాపం
హైదరాబాద్ ,వి90న్యూస్ ,జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని వ్యక్తం చేశారు. పెద్ది మరణంతో తానొక ఆప్త మిత్రుడిని, నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలోనూ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమంలోనూ తనతో కలిసి నడిచిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా KCR స్మరించుకున్నారు. పెద్దిని బతికించుకునేందుకు పార్టీ పరంగా చేసిన విశ్వప్రయత్నాలు, వైద్యుల కృషి ఫలిచకపోవడం తీరని మనోవేదనను కలిగించిందన్నారు.తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీలతో ప్రజాజీవనం సాగించిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని కొనియాడారు. పోరాటాల ఖిల్లా నర్సంపేట గడ్డపై పార్టీ జెండాను ఎగురవేసి, పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు లొంగకుండా మొక్కవోని ధైర్యంతో పోరాడిన ధీరుడని ప్రశంసించారు. చివరి శ్వాస వరకు పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన ఆయన మరణం బీఆర్ఎస్కు తీరని లోటని పేర్కొన్నారు. పెద్ది కుటుంబానికి పార్టీ సర్వవేళలా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు, అభిమానులకు, కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పెద్ది పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.

