కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన: మెస్ బిల్లులపై అధికారులతో వాగ్వాదం
హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 01: హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ఎదుట బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం తమపై అదనంగా మెస్ బిల్లుల భారం మోపిందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు రెండు వేల రూపాయల వరకు ఉండే మెస్ ఛార్జీల స్థానంలో మూడు వేల రూపాయలు వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది మెస్ ఛార్జీలు పూర్తిగా చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అందిస్తామని అధికారులు స్పష్టం చేయడంతో ఆవేదన చెందిన విద్యార్థులు ఒకేసారి పరిపాలన భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర కలకలం రేగగా, పరిస్థితిని గమనించిన కేయూ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విద్యార్థులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.

