హుజురాబాద్ రాజకీయంలో తీవ్ర సలసల..
సబ్బని వెంకట్పై కుట్ర వెనుక ఎవరు?
హైదరాబాద్లో కేసు నమోదుతో మారిన సమీకరణాలు!
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 01: హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిరంతరం ప్రజా సమస్యలపై పదునైన గళాన్ని వినిపిస్తూ వచ్చిన సబ్బని వెంకట్ ఇంటిపై జరిగిన దాడి ఘటన, దాని తదనంతర పరిణామాలు ఇప్పుడు స్థానికంగానూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారాయి. ప్రజాదరణను చూసి తట్టుకోలేకే కొంతమంది కుట్ర పూరితంగా ఈ ఘటనకు ఒడిగట్టారనే ఆరోపణలు వస్తుండగా, దీనిపై హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లో అధికారికంగా కేసు నమోదు కావడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది.పట్టణంలో ఎన్నో రోజులుగా ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యపై సబ్బని వెంకట్ చేపట్టిన ప్రజా పోరాటం, దానికి లభించిన మద్దతు స్థానిక రాజకీయాన్ని కుదిపేసింది. ప్రతిపక్ష శ్రేణులతో కలిసి ఆయన నిర్వహించిన నిరసన కార్యక్రమాలు, స్థానిక ప్రజాప్రతినిధి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీనివల్ల సబ్బని వెంకట్కు ప్రజాదరణ గణనీయంగా పెరిగిందని, ఈ ఆదరణను సహించలేని ప్రత్యర్థులే ఆయనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ కుట్ర పన్నారని మద్దతుదారులు బలంగా ఆరోపిస్తున్నారు.ఇంటిపై ప్రత్యక్ష దాడికి తెగబడటంతో పాటు సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికల్లో ఆయనపై వ్యక్తిత్వ హననానికి (చరిత్రను దిగజార్చేలా) పూనుకోవడం అంతా పక్కా స్కెచ్లో భాగమేనని తెలుస్తోంది. భవిష్యత్తులో సబ్బని వెంకట్ రాజకీయంగా ఎదగకుండా, ముఖ్యంగా వచ్చే 2028 శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలను ముందే తుంచేసేందుకే ఈ విధంగా బురదజల్లే రాజకీయాలకు దిగారని ఆయన అనుచరవర్గం భావిస్తోంది.అయితే, ఈ వ్యవహారంపై హైదరాబాద్లో పోలీసు కేసు నమోదు కావడం స్థానిక రాజకీయాల్లో పెద్ద బాంబులా పేలింది. ఈ కేసు దర్యాప్తు వేగవంతమైతే, దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఎవరు? వెనుక ఉండి నడిపించిన పెద్ద తలకాయలు ఎవరు? అనే విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. పోలీసు విచారణ పూర్తయి, నిజానిజాలు బయటకు వస్తే హుజురాబాద్ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది.

