ఆగస్టు 10న జైల్ భరోను జయప్రదం చేయండి: CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 02: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న చేపట్టే జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల (వ్యాకాస) జిల్లా కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. రైతు డిస్కమ్లను రద్దు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లతో పాటు వీబీ గ్రామ్జీ చట్టాలను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశభక్తి ముసుగులో ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని కొప్పుల శంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని, 32 దేశాల నుంచి దిగుమతులను ప్రోత్సహించడం వల్ల దేశీయ రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా పనిగంటలు పెంచి, 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మిక వర్గానికి తీరని ద్రోహమన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, రాష్ట్రాలపై భారం వేస్తూ ఆ చట్టాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.గ్రామస్థాయిలో కరపత్రాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామని, కొద్దిమంది పెట్టుబడిదారులకు కొమ్ముకాసే విధానాలను వీడకపోతే భవిష్యత్తులో అన్ని వర్గాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జక్కుల రమేష్ యాదవ్, మండల నాయకులు కన్నం సదానందం, గడ్డం శోభన్, ఇల్లందుల సమ్మయ్య, పోచయ్య, కిరణ్, సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

