జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 02: హుజూరాబాద్లోని మధువని గార్డెన్స్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) కరీంనగర్ జిల్లా శాఖ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన జర్నలిస్టులకు ఇళ్ల పట్టా భూములు ఇప్పించామని గుర్తుచేశారు.

హుజూరాబాద్లో జర్నలిస్టులకు కేటాయించిన పట్టా భూములపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని ఎమ్మెల్యే ఆరోపించారు. జర్నలిస్టులకు కేటాయించిన భూములను తిరిగి వారికి అందించేలా ప్రభుత్వంతో ఎంతవరకైనా పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాగే కొంతమంది జర్నలిస్టులకు పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులను తానే స్వయంగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న విలేకరులకు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, వారి సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు.

