తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి: కందుగుల ఉపసర్పంచ్ మండ సతీష్
కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 03: తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణులు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కందుగుల ఉపసర్పంచ్ మండ సతీష్ సూచించారు. హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిడ్డకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయని, పుట్టిన వెంటనే తప్పనిసరిగా ముర్రుపాలు పట్టించాలని పేర్కొన్నారు. కనీసం ఆరు నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిపాలలో అనేక పోషకాలు, ఎంజైములు, హార్మోన్లు సమపాళ్లలో లభిస్తాయని, వీటివల్ల చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఎదుగుతారని తెలిపారు. బిడ్డకు ఎనిమిది నెలలు నిండిన తర్వాత అదనపు పోషకాహారాన్ని అందిస్తూనే, రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు పట్టించాలని సూచించారు. అదేవిధంగా పసిపిల్లలకు పాలు ఇచ్చే సమయంలో బాలింతలు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.గర్భిణులు తమ ఆహార విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, జంక్ఫుడ్కు దూరంగా ఉంటూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు. తృణధాన్యాలైన కొర్రలు, సజ్జలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని వివరించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పు మహేష్, పంచాయతీ కార్యదర్శి మధుకర్, అంగన్వాడీ టీచర్లు రజిత, పద్మ, ఏఎన్ఎం సైదాబాన్, ఆశా వర్కర్లు సరూప, స్వప్న, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

