తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేయాలి: వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్
కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, ఆగస్టు 04: వాగోడ్డు-రామన్న పల్లెలో నిర్వహించిన గ్రామ పంచాయతీ గ్రామ సభ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) రాకేష్ పాల్గొని రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణం వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని, బావులు, బోర్లు , కెనాల్స్ కింద ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు ఇచ్చే కూరగాయలు, పప్పు ధాన్యాలు , ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. నీటిని పొదుపుగా వాడుకుంటూ పంట దిగుబడులను పెంచుకోవడానికి బిందు సేద్యం (డ్రిప్), తుంపర సేద్యం (స్ప్రింక్లర్) పద్ధతులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాల కోసం రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ఆరుతడి పంటల వైపు మళ్లీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

