హుజూరాబాద్లో బీజేపీకి షాక్: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ముగ్గురు సర్పంచ్లు
కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, ఆగస్టు 04: హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి, ఈటల రాజేందర్కు భారీ షాక్ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలానికి చెందిన ముగ్గురు సర్పంచ్లు హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో సిరిసేడు సర్పంచ్ కుమార్, వంతడువుల సర్పంచ్ రాజేష్, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల మనసుల్లో చెక్కుచెదరలేదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, బీజేపీ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్నారని, ఆయన నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

