మండల కేంద్రాల్లో ఇక ప్రజావాణి

0
100633909

ప్రతి సోమవారం ప్రజల వద్దకే పాలన, ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

హైదరాబాద్,వి90న్యూస్,ఆగస్టు 04: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు అతి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో (MPDO ఆఫీస్) మండల స్థాయి ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని పౌర సంబంధాల శాఖ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. స్థానిక సమస్యల వేగవంతమైన పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ వేదికకు తహసీల్దార్, MPO, MAO, MEO, PHC వైద్య అధికారి, CDPO, సంక్షేమ అధికారులు, విద్యుత్, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ సహా దాదాపు 23 రకాల మండల స్థాయి శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇప్పటివరకు చిన్నచిన్న సమస్యలు, భూ వివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు లేదా స్థానిక మౌలిక వసతుల దరఖాస్తుల కోసం జిల్లా కలెక్టరేట్లకు వెళ్లాల్సి వచ్చే గ్రామీణ ప్రజలకు మండల స్థాయిలోనే ఈ వేదిక అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణ భారం, సమయం, ఆర్థిక ఖర్చులు విశేషంగా తగ్గుతాయి. ప్రజా ఫిర్యాదుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ లేదా రిజిస్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి దరఖాస్తుకు నిర్ణీత కాలపరిమితిలో పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీనివల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరిగి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు ప్రజలకు అత్యంత పారదర్శకంగా అందుతాయి.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *