అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి
కాకతీయ యూనివర్సిటీకి ఎల్.ఎల్.బి విద్యార్థుల విజ్ఞప్తి
హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 06: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఖమ్మం మనేరు లా కళాశాలతో పాటు అనుబంధ న్యాయ కళాశాలల ఎల్.ఎల్.బి (3YDC/5YDC) 5వ సెమిస్టర్ విద్యార్థులు తమ విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారికి (Controller of Examinations) వినతిపత్రాన్ని సమర్పించారు. గత సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని వారు కోరారు. దీనివల్ల విద్యార్థులు సకాలంలో డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత విద్య, బార్ కౌన్సిల్ నమోదుతో పాటు ఉద్యోగ అవకాశాలను పొందే వీలుంటుందని తెలిపారు.అలాగే రెండవ, నాలుగవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను తదుపరి రెగ్యులర్ పరీక్షలకు ముందే విడుదల చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఫలితాలు త్వరగా రావడం వల్ల మళ్లీ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి తప్పి, విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉంటుందని పేర్కొన్నారు. దీనితో పాటు 2025 బ్యాచ్కు అమలు చేసిన 40 శాతం పాసింగ్ విధానాన్ని (20 మార్కులు ఎక్స్టర్నల్ + 20 మార్కులు ఇంటర్నల్) తమ బ్యాచ్కు కూడా వర్తింపజేయాలని, ఇది అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.విద్యార్థుల ఈ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ అధికారులను కోరారు. యూనివర్సిటీ యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తే వందలాది మంది న్యాయ విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

