విద్యార్థినులపై జరిమానాలు విధించవద్దు: ఖమ్మం రైల్వే స్టేషన్ మేనేజర్కు వినతి
ఖమ్మం,వి90 న్యూస్,ఆగస్టు 06: ప్రభుత్వ మహిళా జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థినులకు రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ లేదనే నెపంతో జరిమానాలు విధించవద్దని కోరుతూ జార్జిరెడ్డి PDSU, AISA ప్రతినిధుల బృందం ఖమ్మం రైల్వే స్టేషన్ మేనేజర్ను కలిసి మాట్లాడింది. కళాశాలకు వెళ్లే క్రమంలో వందలాది మంది విద్యార్థినులు రైల్వే స్టేషన్ ఫుట్పాత్ బ్రిడ్జి ద్వారా వెళ్తున్నారని, అయితే రైల్వే చట్టాలు మారాయని చెబుతూ అతి ఉత్సాహంతో వారిపై జరిమానాలు విధిస్తున్నారని, గుంజీలు తీయాలంటూ వేధిస్తున్నారని ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జార్జిరెడ్డి PDSU జిల్లా అధ్యక్షుడు సురేష్, AISA రాష్ట్ర సమన్వయకర్త జమ్మి అశోక్, PDSU జిల్లా గర్ల్స్ కన్వీనర్ పైండ్ల శ్యామల మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి విద్యార్థినులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారని గుర్తుచేశారు. రైల్వే స్టేషన్ పక్కనే కళాశాలలు ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ దాటేందుకు ప్రిన్సిపాల్తో మాట్లాడి ఉచిత పాస్లు ఇవ్వడం, ఫుట్పాత్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రైల్వే అధికారులదేనని స్పష్టం చేశారు.విద్యార్థి సంఘాల విజ్ఞప్తిపై ఖమ్మం రైల్వే స్టేషన్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, మహిళా కళాశాల విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినులపై ఎలాంటి జరిమానాలు విధించవద్దని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు కృష్ణవేణి, హర్షిత, వర్ధిని, అనూష, దివ్య, అఖిల, యక్షిత, స్పందన, సౌమ్య, రాజేశ్వరి, మహమూదా, రుక్సానా, ఉష, కీర్తన, త్రిష, పూజిత, సాయిచరణ్య, నవ్య తదితరులు పాల్గొన్నారు.

