హనుమకొండ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం: చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తున్నారని బంధువుల ఆందోళన
హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 06:డబ్బుల కోసం కక్కుర్తి పడి హనుమకొండ విజయ టాకీస్ సమీపంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం మృతి చెందిన వ్యక్తికి వెంటిలేటర్ పై వైద్యం అందిస్తూ విపరీతంగా బిల్లులు వసూలు చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బుల్లికొండ గ్రామానికి చెందిన పంజాల శ్రీధర్ (32) అనే వ్యక్తి బ్రెయిన్ క్లాట్ కావడంతో స్థానిక వైద్యుడి సిఫార్సు మేరకు మొదట బాలసముద్రంలోని ఒక ఆసుపత్రికి, ఆ తర్వాత విజయ టాకీస్ రోడ్డులోని న్యూరో ఫిజీషియన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల నుంచి బాధితుడిలో ఎలాంటి కదలికలు కానీ, స్పర్శ కానీ లేవని బంధువులు చెబుతున్నారు.ఆరోగ్య పరిస్థితి గురించి నిలదీయగా వైద్యులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ విపరీతంగా బిల్లులు వేస్తున్నారని, అంత డబ్బు చెల్లించలేమని పేషెంట్ వాస్తవ పరిస్థితి చెప్పమని కాళ్లు పట్టుకున్నా యాజమాన్యం కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈనెల 4వ తేదీన ఆరోగ్యశ్రీ ప్రాసెస్లో ఉన్న 70 వేల రూపాయలు కూడా వసూలు చేశారని, బిల్లులు మొత్తం చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని నిర్బంధిస్తున్నట్లు సమాచారం. శ్రీధర్ అప్పటికే మరణించినప్పటికీ కేవలం బిల్లులు పెంచుకోవడానికి వెంటిలేటర్ అమర్చి నాటకమాడుతున్నారని బంధువులు బలంగా అనుమానిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన శ్రీధర్కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తక్షణమే జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు స్పందించి సదరు ప్రైవేట్ ఆసుపత్రి దోపిడీపై సమగ్ర విచారణ జరిపి, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

