ఖర్గేకు అవమానం: హనుమకొండలో కాంగ్రెస్ నిరసన, సత్యాగ్రహ దీక్ష
హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 14: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ వైఖరిని నిరసిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష , నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాఖండ్లో నిర్వహించిన కాంగ్రెస్ సభ అనంతరం మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను, ఆయన కూర్చున్న స్థలాన్ని బీజేపీ మద్దతుదారులు గంగాజలంతో శుద్ధి చేశారని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్న నేతలు, ఖర్గేకు జరిగిన అవమానానికి సంబంధించి బీజేపీ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీక్షా ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం , బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కావ్య, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

