జమ్మికుంటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్: రూ. 11,400 విలువైన గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 16: జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జమ్మికుంటలో గంజాయిని అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 11,400 విలువ కలిగిన 230 గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన నాగిరెడ్డి హరిప్రసాద్ (26) , మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దుర్గం కార్తిక్ (19) ఉన్నారు. నాగిరెడ్డి హరిప్రసాద్ హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలోని ఒక ఓయో రూమ్స్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుండగా, దుర్గం కార్తిక్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఆదిబట్ల ప్రాంతంలో నివాసముంటున్నాడు.పోలీసుల విచారణలో నిందితులిద్దరూ గంజాయి అలవాటుకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. వీరు మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గంలో మందమర్రికి తరలించి దాచిపెట్టారు. అనంతరం జమ్మికుంటలోని ఎఫ్సీఐ గోడౌన్ పరిసర ప్రాంతంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణాపై జమ్మికుంట పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.

