మేడారంలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ

0
FB_IMG_1786899127149

ములుగు/మేడారం,వి90 న్యూస్,ఆగస్టు 16: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ములుగు జిల్లా మేడారంలోని వనదేవతలు సమ్మక్క–సారలమ్మల సన్నిధిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా గద్దెలను దర్శించుకున్న ముఖ్యమంత్రి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులో భాగంగా నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు.

ఆలయ ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. సీఎం రాక సందర్భంగా గిరిజన పూజారులు సంప్రదాయ డోలు వాయిద్యాలు, ఆచార వ్యవహారాల నడుమ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.పూజా కార్యక్రమాల అనంతరం స్థానికంగా ఉన్న అర్హులైన వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేసి రాష్ట్రవ్యాప్త పంపిణీకి శ్రీకారం చుట్టారు. అలాగే మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు.

క్షేత్రానికి వచ్చే భక్తులకు నిరంతరం పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పక్కా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల (SHG) సభ్యులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మహిళా సంఘాలు చేపడుతున్న వివిధ వ్యాపార, సంక్షేమ కార్యక్రమాలు, వారి ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్థితిగతుల గురించి అడిగి తెలుసుకుని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed