ప్రిన్సిపాల్ దారుణ హత్యను నిరసిస్తూ షాద్నగర్లో భారీ క్యాండిల్ ర్యాలీ
ఉపాధ్యాయులపై దాడులను అరికట్టాలని TRSMA డిమాండ్
రంగారెడ్డి/షాద్నగర్,వి90 న్యూస్,ఆగస్టు 20: నల్గొండ జిల్లా మల్లేపల్లిలో ప్రిన్సిపాల్పై జరిగిన దారుణ హత్యను నిరసిస్తూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మృతిచెందిన ప్రిన్సిపాల్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ వేల్వేషన్ ప్రాంతం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ఈ శాంతియుత నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని 53 ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.ర్యాలీ అనంతరం విద్యాసంస్థల ప్రతినిధులు, TRSMA నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు విచక్షణ కోల్పోయి ఉపాధ్యాయులపై దాడులకు తెగబడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా ప్రభావం, చెడు వ్యసనాలు, మాదకద్రవ్యాల వైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వారి ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలల్లో చదువుతో పాటు నైతిక విలువలు, మానవత్వం, క్రమశిక్షణ పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు తగిన రక్షణ కల్పించాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సెలింగ్, అవగాహన తరగతులు విస్తృతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

