హుజురాబాద్ నియోజకవర్గ సమస్యల తక్షణ పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతి
కరీంనగర్,వి90 న్యూస్,మే 29: హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలతో పాటు నియోజకవర్గంలోని వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ సహా ఐదు మండలాల్లో నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రతి గ్రామానికి, ప్రతి కాలనీకీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.దీనితో పాటు దళితబంధు పథకం రెండో విడతను త్వరితగతిన ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని, నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు చేసే ఈ పథకం అమలు ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండల కేంద్రంలోని డబుల్ రోడ్డు, రాచపల్లి రోడ్డు, పోతిరెడ్డిపల్లి రోడ్డు, కోర్కల్ రోడ్డు, నాగంపేట రోడ్ల దుస్థితి కారణంగా ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించిన ఎమ్మెల్యే, ఆయా రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో మక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి తగిన సౌకర్యాలు కల్పించాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ రాజకీయాలకు అతీతంగా నిజమైన పేదలను పారదర్శకంగా గుర్తించి ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టణ స్థానిక సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు.

