ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తప్పవు: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ,వి90 న్యూస్,జూలై 28: ప్రశ్నాపత్రాల లీకేజీలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆఫ్లైన్ విధానంలోనే పరీక్షల నిర్వహణలో ప్రధానంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఆన్లైన్ విధానంలో ఎలాంటి ఇబ్బందులు రావడం లేదని పేర్కొన్నారు. దేశంలో అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోచింగ్ కేంద్రాలే లీకేజీలకు వేదికలుగా మారుతున్నాయని, ఈ అంశంపై జాతీయ స్థాయిలో సమగ్ర విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.విద్యా వ్యవస్థపై, విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యను వీలైనంతవరకు రాష్ట్రాల పరిధిలోనే ఉంచితే పొరపాట్లకు ఆస్కారం తక్కువగా ఉంటుందని, దీనిపై పార్లమెంట్లో విస్తృత చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. యూపీఎస్సీ తరహాలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని, విద్యార్థుల్లో నమ్మకం కలిగించేలా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో గ్లోబరీనా వంటి సంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే అవి సీబీఎస్ఈ పరీక్షల వరకు విస్తరించి గందరగోళం సృష్టించాయని విమర్శిస్తూ, అలాంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతోందని, గత ప్రభుత్వ బకాయిల భారం ఉన్నప్పటికీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏటా రూ. 2,200 కోట్ల నుంచి రూ. 2,400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్కు అవసరమవుతాయని, భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన నిధులను ఆ సంవత్సరమే ముందస్తుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యే ఉండదని ధీమా వ్యక్తం చేశారు.మరొకవైపు, హైడ్రా (HYDRAA) కార్యాచరణ, బాధ్యతలపై ప్రభుత్వానికి పూరి స్పష్టత ఉందన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించి ప్రభుత్వపరంగా సమీక్షిస్తామని, న్యాయస్థానాల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందన్నారు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే, ఆక్రమణలపై హైడ్రా చేపడుతున్న చర్యలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఆయన కుండబద్దలు కొట్టారు.

