ప్రజల గడపకే సంక్షేమ ఫలాలు: లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 06: హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటూ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పరిధిలోని నిరుపేద లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, హుజురాబాద్ పట్టణంలోని దమ్మక్కపేట, గాంధీనగర్, ప్రతాపవాడ తదితర ప్రాంతాల్లోని లబ్ధిదారుల ఇండ్లకు ఆయనే స్వయంగా వెళ్లారు. బాధిత కుటుంబాలను వారి నివాసాల్లోనే కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయా కుటుంబాల ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, పేద , మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య ఖర్చుల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక కొండంత భరోసాగా నిలుస్తోందని అన్నారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడమే ప్రజాప్రతినిధుల ప్రథమ బాధ్యత అని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సకాలంలో అందేలా తాము నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామిగా ఉంటూ, వారి గడప వద్దకే సంక్షేమాన్ని చేర్చడాన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్వయంగా ఎమ్మెల్యే తమ ఇంటికి వచ్చి ఆర్థిక భరోసా కల్పించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు , లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

