మహిళా సాధికారతకు బాటలు: తెలంగాణలో ‘స్త్రీ రైడ్స్’ ప్రాజెక్టును ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 06: తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ, ఆర్థిక స్వాలంబనే ధ్యేయంగా పోలీస్ శాఖ శనివారం నాడు ఒక సరికొత్త మైలురాయిని అధిగమించింది. మహిళలను రవాణా రంగంలో స్వయం సమృద్ధులుగా మార్చడంతో పాటు వారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్త్రీ రైడ్స్’ ప్రాజెక్టును రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు. మహిళలకు ద్విచక్ర (2 వీలర్), త్రిచక్ర (3 వీలర్) వాహనాల డ్రైవింగ్లో వృత్తిపరమైన నైపుణ్యాలను నేర్పించి, వారిని సొంత కాళ్లపై నిలబెట్టడమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం.ఈ ప్రాజెక్టు మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన 55 మంది మహిళలకు అంబర్పేట్ పోలీస్ లైన్స్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ ఇప్పిస్తోంది. సాధారణంగా రవాణా రంగంలో ప్రయాణించేటప్పుడు మహిళలపై జరిగే వేధింపులకు అడ్డుకట్ట వేస్తూ, తోటి మహిళలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఈ ‘స్త్రీ రైడర్లను’ పోలీస్ శాఖ సన్నద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారతను సాధించడమే లక్ష్యంగా ఈ సరికొత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇది మహిళల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

