జమ్మికుంటలో విషాదం: వడదెబ్బతో మిల్లు గుమస్తా అకాల మరణం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, జూన్ 06: జమ్మికుంట పట్టణంలో గత కొన్ని రోజులుగా భానుడు భగభగలాడుతుండటంతో తీవ్రమైన ఎండల ప్రభావానికి ఓ వ్యక్తి బలి అయ్యాడు. పట్టణానికి చెందిన ఆడెపు లక్ష్మణ్ (45) వడదెబ్బ తగిలి మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుడు కనకయ్య కుమారుడైన లక్ష్మణ్, స్థానిక ఒక మిల్లులో గుమస్తాగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ఆయన వడదెబ్బకు గురయ్యాడు.వడదెబ్బ ప్రభావంతో లక్ష్మణ్ గత రెండు రోజుల నుండి తీవ్రమైన విరేచనాలతో బాధపడినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. తీవ్రమైన ఎండల వల్ల శరీరంలో నీటి శాతం పూర్తిగా తగ్గిపోవడంతో (డీహైడ్రేషన్) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. అనుదినం కష్టపడుతూ కుటుంబాన్ని సాకుతున్న లక్ష్మణ్ ఇలా అకాల మరణం చెందడంతో ఆయన భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక మిల్లు కార్మికుల్లో, పట్టణ ప్రజల్లో తీవ్ర శోకం వ్యక్తమవుతోంది.

