పట్టణాభివృద్ధే ధ్యేయం: జమ్మికుంట మున్సిపాలిటీలో ముమ్మరంగా సాగుతున్న వార్డు సభలు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 06: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ మొలగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి పర్యవేక్షణలో శనివారం నాడు 4, 6, 10, 28, 29 వార్డులలో ప్రత్యేకంగా వార్డు సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా వార్డులలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానిక ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించారు.వార్డుల్లో ఏళ్ల తరబడి వేధిస్తున్న ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సభలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు స్పష్టం చేశారు.ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణ నియమాలను పాటించడం, జల్ సంచయ్ – జల్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ రైన్ వాటర్ హార్వెస్టింగ్ (ఇంగుడు గుంతల) నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైన్ల పూడికతీత, శుభ్రపరిచే పనులు, రుతుపవనాల సన్నద్ధతకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.అలాగే పట్టణంలో తాగునీటి సరఫరా, నిర్వహణ, నీటి నిల్వలు లేకుండా చూసి దోమల నివారణకు పారిశుధ్య చర్యలు చేపట్టడం, దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం చేపట్టాలని, అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సభలలో వైస్ ఛైర్మన్ మహమ్మద్ ముంతాజ్ అలీ (జావిద్), ఆర్ ఐ భాస్కర్, శ్రీనివాస్, రమేష్ లతో పాటు పలు వార్డుల కౌన్సిలర్లు, వార్డు అధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

