కొరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ‘బడిబాట’ కార్యక్రమం: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి పిలుపు

0
IMG-20260610-WA0019

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 10: జమ్మికుంట మండలంలోని కొరపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్) ఉపాధ్యాయులు బుధవారం రోజున ‘బడిబాట’ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం గ్రామంలోని వీధివీధినా తిరుగుతూ, బడి ఈడు వయసున్న పిల్లలందరినీ కొరపల్లి ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే విద్యా ప్రమాణాలు, సౌకర్యాల గురించి క్షుణ్ణంగా వివరించారు.ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత అనుభవజ్ఞులైన, ప్రభుత్వం చేత అర్హత పొందిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇక్కడ ఉచితంగా నాణ్యమైన మధ్యాహ్న భోజనము, ఉచిత పాఠ్యపుస్తకాలు , నోటు పుస్తకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం చదువే కాకుండా విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగానే బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఉచితంగా కరాటే శిక్షణతో పాటు, ఆటలలో ప్రత్యేక శిక్షణ వంటి మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నామని ఆయన వివరించారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా, ప్రభుత్వ ఉచిత సదుపాయాలను సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలో విద్యా వ్యాప్తికి, ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు చేసిన ఈ ప్రచారానికి తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించింది. ఈ బడిబాట అవగాహన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సభ్యులు పి. రాజయ్య, ఆవాల నరహరి, పి. రాజు, సి. రవి కాంత్ రాజు, పి. కుమారస్వామి, సంపత్, సీఆర్పీ గుర్రప్ప , స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed