జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ సాధారణ సమావేశం: రైతులకు పాలకవర్గం అండగా ఉంటుంది – మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 10: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన, అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం బుధవారం నాడు అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్ ) మాట్లాడుతూ, జమ్మికుంట మార్కెట్కు వచ్చే రైతులకు అన్ని విధాలుగా పాలకవర్గం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న వర్షాకాలం (ఖరీఫ్) సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలని, అలాగే మంచి దిగుబడిని ఇచ్చే పంటల వైపు మొగ్గు చూపాలని ఆయన సూచించారు.

రైతులకు సకాలంలో ఎరువులు , అవసరమైన సదుపాయాలు అందేలా చూస్తామని, తద్వారా రైతులు మంచి దిగుబడి సాధించి తమ కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ సమావేశంలో ఒక ఆత్మీయ కార్యక్రమం చోటుచేసుకుంది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నుండి బదిలీపై వెళ్తున్న మార్కెట్ కమిటీ ఉద్యోగి విజయ్ ని మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు. ఈ సాధారణ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు , అధికారులు తదితరులు పాల్గొని మార్కెట్ బలోపేతానికి, రైతు సంక్షేమానికి తీసుకోవాల్సిన పలు కీలక నిర్ణయాలపై చర్చించారు.

