హుజురాబాద్లో బీఆర్ఎస్ జెండా కిందకు ప్రజానాయకులు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి కాంగ్రెస్, బీజేపీ నేతలు
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూన్ 10: హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ విధానాల పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ రాజపల్లి గ్రామానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆయా పార్టీలను వీడి గులాబీ గూటికి చేరారు. రాజపల్లి గ్రామ సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, జూపాక సింగిల్ విండో చైర్మన్ అలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ తరఫున గెలిచిన ఉప సర్పంచ్ శనిగరం అయిలయ్యతో పాటు వార్డు సభ్యులు, బీజేపీ బూత్ అధ్యక్షుడు ఈర్ల రాజు, ఈర్ల ప్రవీణ్, మునిగాల పోచయ్య, శనిగరపు సమ్మయ్య, నోముల కరుణాకర్, పత్తి శ్రీనివాస్ రెడ్డి, శనిగరపు రవి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షుడు ఎండి రమీజ్, రాజపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ చెవుల సాయి కుమార్ తదితరులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

పార్టీలోకి వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి గ్రామ గ్రామాన విశేష ఆదరణ లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. విపక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, హుజురాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం మరింత శక్తివంతంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. విపక్షాలకు చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడంతో రాజపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తుగా బలోపేతం అయిందని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులంతా గ్రామ అభివృద్ధి , ప్రజా సమస్యల పరిష్కారంలో పాత నాయకులతో కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ భారీ చేరికల కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డిలతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు , రాజపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

