హుజురాబాద్ గుండ్ల చెరువు మత్తడి ఎత్తు తగ్గించి వరద ముప్పు తప్పించాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, జూన్ 10: హుజూరాబాద్ పట్టణంలోని గుండ్ల చెరువు మత్తడి ఎత్తు కారణంగా ప్రతి వర్షాకాలంలో స్థానిక ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మత్తడి ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్వాటర్ ప్రభావంతో పట్టణంలోని పోచమ్మవాడతో పాటు పలు కాలనీలు నీట మునుగుతున్నాయని, చెరువు వెనుక భాగంలో ఉన్న సుమారు వంద మంది రైతుల వ్యవసాయ భూములు కూడా జలమయమై తీవ్ర నష్టం వాటిల్లుతోందని బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మేరకు కాలనీవాసులు, రైతులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.బాధితుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఈఈ, డీఈ అధికారులను వెంటబెట్టుకుని గుండ్ల చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్య తీవ్రతను అధికారులకు స్వయంగా వివరించిన ఎమ్మెల్యే, వర్షాకాలంలో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా మత్తడి ఎత్తును తగ్గించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

