యువతి అదృశ్యం: మంచిర్యాల యువకుడిపై కుటుంబ సభ్యుల అనుమానం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 11: జమ్మికుంట మండల పరిధిలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన గుంటి మమత అనే 30 ఏళ్ల యువతి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు గుంటి అయిలయ్య చిన్న కూతురైన మమత డిగ్రీ వరకు చదువుకుని ఇంటి వద్దనే ఉంటోంది. గత కొంతకాలంగా తండ్రి ఆమెకు వివాహం చేయడానికి పలు సంబంధాలు తీసుకువచ్చినప్పటికీ, పెళ్లి ఇష్టం లేదంటూ ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. దీంతో తండ్రి అయిలయ్య నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పమ్మా అని అడగగా, తాను మంచిర్యాలకు చెందిన రవికుమార్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు మమత తెలిపింది. దానికి తండ్రి కూడా సానుకూలంగా స్పందిస్తూ సరే నీ ఇష్టం అని చెప్పారు. అయినప్పటికీ, ఈరోజు (గురువారం) తెల్లవారుజామున మూడు నుండి నాలుగు గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తున్న సమయంలో మమత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది. ఉదయం లేచి చూసేసరికి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో విస్తృతంగా వెతికినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. అదృశ్యమయ్యే సమయంలో ఆమె ఎరుపు రంగు టీ షర్ట్, నైట్ ప్యాంట్ ధరించి ఉందని, సుమారు 5.4 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉంటుందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు మమత ప్రస్తుతం ఆ రవికుమార్ అనే యువకుడి వద్దే ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి అయిలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

