ప్రకృతి వ్యవసాయానికి కేంద్రం అండగా నిలవాలి: కేవీకే సమావేశంలో మంత్రి బండి సంజయ్కు సంద మహేందర్ వినతి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 11: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ కార్యకర్త సంద మహేందర్ కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయి ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం, రైతులకు కలిగే ప్రయోజనాలను సవివరంగా వివరించారు. రసాయన రహిత సాగు అవసరం, భూసార పరిరక్షణ, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి వంటి అంశాలను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న అధిక సాగు ఖర్చులు, రసాయన ఎరువుల వినియోగం వల్ల ఏర్పడుతున్న సమస్యలకు ప్రకృతి వ్యవసాయం సమర్థవంతమైన ప్రత్యామ్నాయమని పేర్కొంటూ, దీనిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను సంద మహేందర్ శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ, వ్యవసాయ, మౌలిక వసతుల రంగాల విజయాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక పుస్తకాలను ఆయన కేంద్ర మంత్రికి అందజేశారు. దేశ అభివృద్ధిలో రైతాంగం కీలక పాత్ర పోషిస్తోందని, రైతుల సంక్షేమానికి ప్రకృతి వ్యవసాయం వంటి సుస్థిర వ్యవసాయ విధానాలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. రైతులు ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించి భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు అధిక ఆదాయాన్ని సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, బీజేపీ నాయకులు , ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

