అమెరికా క్షిపణి దాడిలో ముగ్గురు భారత నావికులు మృతి: తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

0
100576204

ఒమన్,(అంతర్జాతీయం) వి90 న్యూస్, జూన్ 12: ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ‘జల్‌వీర్’ అనే భారత వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన క్షిపణి దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనలో భారత నావికులు డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయులు ఉండగా, ప్రమాద తీవ్రతకు నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన ఒమన్ సైన్యం సకాలంలో స్పందించి 21 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించింది. భారత వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా జరిపిన ఈ దుశ్చర్యపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబారికి భారత విదేశాంగ శాఖ తక్షణమే సమన్లు జారీ చేసి తన నిరసనను గట్టిగా వినిపించింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నిలిపివేయాలని భారత్ డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా కూడా భారత్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. వరుస దాడుల కారణంగా భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ భరోసా ఇచ్చారు. అలాగే మృతి చెందిన నావికుల భౌతికకాయాలను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed