జమ్మికుంటలో పోల్నెని రవీందర్ రావు వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 16: జమ్మికుంట మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు పోల్నెని రవీందర్ రావు వర్ధంతిని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజుతో పాటు కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, టంగుటూరి రాజ్ కుమార్ తదితరులు రవీందర్ రావు త్యాగాలను స్మరించుకున్నారు. 1997 కాలంలో జమ్మికుంట మండల బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన రవీందర్ రావు, నాటి అయోధ్య రామమందిర నిర్మాణ రథయాత్రను జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని వారు గుర్తుచేశారు. ఈ క్రమంలోనే నక్సలైట్లు ఆయనను టార్గెట్ చేసి పార్టీకి రాజీనామా చేయాలని, లేదంటే ప్రాణాలు తీస్తామని బెదిరించినప్పటికీ ఆయన ప్రజా ఉద్యమాల వైపే నిలిచారని కొనియాడారు. భయపడకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్న రవీందర్ రావును 1997 జూన్ 15వ తేదీ అర్ధరాత్రి సంఘవిద్రోహ శక్తులు, నరహంతక నక్సలైట్లు అడ్డగించి, విపరీతంగా కొట్టి దారుణంగా హత్య చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నక్సలైట్లు రవీందర్ రావును భౌతికంగా దూరం చేసినప్పటికీ, ఆయన ఆశయాలను మాత్రం దూరం చేయలేకపోయారని నాయకులు స్పష్టం చేశారు. జమ్మికుంట గడ్డ నుంచి రవీందర్ రావుతో పాటు సమ్మిరెడ్డి వంటి ఎందరో మహానుభావులు దేశం కోసం బలిదానాలు చేశారని, వారి త్యాగాల పునాదులపైనే నేడు బీజేపీ కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రాగలిగిందని తెలిపారు. రవీందర్ రావు అమరత్వాన్ని స్మరిస్తూ పట్టణ బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్, జిల్లా, పట్టణ పదాధికారులతో పాటు బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

