ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశాలకు హాజరైన వొడితల ప్రణవ్: నియోజకవర్గంలో తొలి విడత 85 శాతం పూర్తి
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 17: హుజురాబాద్ నియోజకవర్గంలో పేదలకు లబ్ధి చేకూరేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయని, తొలి విడత కింద మంజూరైన ఇళ్లలో ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. బుధవారం రోజున ఆయన ఇల్లందకుంట మండల పరిధిలోని సిరిసేడు, సీతంపేట, జమ్మికుంట పట్టణ పరిధిలోని మోత్కులగూడెం 8వ వార్డు, అలాగే వీణవంక మండల పరిధిలోని కోర్కల్ గ్రామాలలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశాల కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో లబ్ధిదారులు, స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో పూర్తి పారదర్శకత పాటించామని స్పష్టం చేశారు. రాబోయే రెండవ విడతలో కూడా ఇదే పారదర్శక విధానాన్ని కొనసాగించి, నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజం చేస్తోందని, ఈ రోజు గృహ ప్రవేశాల వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

కొత్త ఇళ్లలోకి అడుగుపెడుతున్న సమయంలో లబ్ధిదారుల కళ్లలో కనిపించిన ఆనందం వెలకట్టలేనిదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఈ పర్యటనలో భాగంగా సిరిసేడు గ్రామంలో జరిగిన పెద్దమ్మతల్లి బోనాల పండుగలో కూడా వొడితల ప్రణవ్ పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు , లబ్ధిదారుల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

