వైభవ్ సూర్యవంశీతో వివాదం: లంక ఆటగాళ్లపై శ్రీలంక క్రికెట్ బోర్డు కఠిన చర్యలు!
శ్రీలంక/దంబుల్లా,వి90న్యూస్ డెస్క్, జూన్ 17: ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి సంచలనం సృష్టించిన భారత 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదం నెలకొంది. ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. లంక ఆటగాడు విషేన్ హలంబాగే ఆధ్వర్యంలో కొందరు ప్లేయర్లు సూర్యవంశీని తీవ్రంగా రెచ్చగొట్టినట్లు వీడియోల ద్వారా స్పష్టమైంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ సదరు లంక ఆటగాడిని వెనక్కి నెట్టడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ అవాంఛనీయ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అత్యంత వేగంగా స్పందించింది. మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రగాష్ సమర్పించిన నివేదిక ఆధారంగా, సూర్యవంశీని మైదానంలో రెచ్చగొట్టిన లంక ఆటగాడు హలంబాగేతో పాటు ఈ వివాదంలో ప్రమేయం ఉన్న మరికొందరు ప్లేయర్లపై బోర్డు కఠిన ఆంక్షలు విధించినట్లు ఓ అంతర్జాతీయ స్పోర్ట్స్ మీడియా వెల్లడించింది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు వారిపై ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకున్నదనే పూర్తి వివరాలను మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వైభవ్ విషయంలో అతిగా ప్రవర్తించిన సదరు లంక ఆటగాళ్లకు భారీ జరిమానాతో పాటు మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు మైదానంలో భౌతిక దాడులను ఐసీసీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో, లంక ప్లేయర్ను నెట్టిన వైభవ్పై బీసీసీఐ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.ఈ అనుకోని వివాదంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. తమ ఆటగాళ్లు ప్రస్తుతానికి టోర్నమెంట్పైనే పూర్తి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నామని, ఇలాంటి బాహ్య అంశాల వల్ల వారు పరధ్యానం చెందకూడదని పేర్కొంటూ సూర్యవంశీపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే భారత సీనియర్ జట్టు స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. వైభవ్ చాలా ప్రశాంతమైన స్వభావం గల కుర్రాడని, అతడిని ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంతలా రెచ్చగొట్టారో తెలియదని అన్నారు. సీనియర్ కోచ్లు అతనికి సరైన దిశానిర్దేశం చేస్తారని, భవిష్యత్తులో మైదానంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

