తెలంగాణలో ఎస్ఐఆర్-2026: 89 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం!
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 17: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026) ప్రక్రియ ఓటర్లకు ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో సుమారు 89.55 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి, వారి వివరాలకు సంబంధించిన సరైన ఆధారాలు చూపాలని అధికారులు కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు సన్నాహాల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 12వ తేదీన రాష్ట్ర ఓటర్ల జాబితాను స్తంభింపజేసింది. ఆ సమయానికి ఉన్న లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది.ఈ ఓటర్ల జాబితా ఆధారంగా అధికారులు చేపట్టిన పరిశీలనలో ఇప్పటివరకు 70.02 శాతం మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. అయితే, 2002 నాటి ఎస్ఐఆర్ జాబితాతో ప్రస్తుత జాబితాను సరిపోల్చి చూసినప్పుడు మ్యాపింగ్ జరిగిన పలువురు ఓటర్ల వివరాల్లో, పేర్లలో చిన్నచిన్న తప్పులతో పాటు వయసు పరంగా భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 89.55 లక్షల మంది ఓటర్ల వివరాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు తేలింది.ఈ నేపథ్యంలో, ఈ లోపాలను సరిదిద్దేందుకు, ఓటర్ల జాబితాను పూర్తి పారదర్శకంగా మార్చేందుకు సదరు ఓటర్లందరికీ నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వయసు, పుట్టిన స్థలం మరియు గుర్తింపునకు సంబంధించి ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల ప్రకారం సరైన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా తగిన ఆధారాలు చూపించని పక్షంలో సదరు ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత, రాబోయే జూలై 31న తెలంగాణ రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.

