జమ్మికుంటలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి: ఘన నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 23: జమ్మికుంట పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు నేతృత్వంలో స్థానిక గాంధీ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొలకాని రాజు, శీలం శ్రీనివాస్, జీడి మల్లేష్ మాట్లాడుతూ, కలకత్తాలో జన్మించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిన్న వయసులోనే బెంగాల్ ఎమ్మెల్యేగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 నుండి 1950 వరకు నెహ్రూ క్యాబినెట్లో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన సేవలు అందించారని పేర్కొన్నారు. అయితే, జమ్మూ-కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ప్రతిపాదనను, నాటి ప్రత్యేక అనుమతి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని వివరించారు. అనంతరం దేశ సమగ్రత కోసం 1951లో భారతీయ జన్ సంఘ్ను స్థాపించారని తెలిపారు.ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదనే బలమైన నినాదంతో కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ముఖర్జీని, నాటి నెహ్రూ ప్రభుత్వం కాశ్మీర్ పాలకులు అడ్డుకుని 40 రోజుల పాటు జైల్లో నిర్బంధించారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే జూన్ 23న ఆయన జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించారని, ఆ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని అన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను గౌరవిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశంలో విలీనం చేసిందని కొనియాడారు. భారత రాజకీయ చరిత్రలో ముఖర్జీ ఒక ధృవతారగా నిలిచిపోతారని వారు స్పష్టం చేశారు.ఈ నివాళులర్పించిన వారిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆకుల రాజేందర్, కైలాసకొటి గణేష్, ఆకుల తిరుపతి, నిరుపమా రాణి, కే, స్వరూప, పల్లపు రవి, గంగాభవాని, బచ్చు శివన్న, మోర్చా అధ్యక్షుడు నసీరుద్దీన్, ఆకుల పోచయ్య, తుర్పాటి శంకర్, పసునూటి శివ, పనికారి రమేష్, పొడేటి అనిల్, అశోక్, ఉడుగుల మహేందర్, మురికి మహేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
