హుజురాబాద్లో విజయవంతమైన పాఠశాలల బంద్: విద్యావ్యవస్థ సమస్యలపై ఏబీవీపీ ఆగ్రహం
కరీంనగర్/హుజూరాబాద్ ,వి90 న్యూస్ జూన్ 23: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హుజురాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బంద్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్డీ (SFD) ప్రాంత కో కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థలు విచ్చలవిడిగా, సామాన్యులకు అందనంతగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే ప్రైవేటు పాఠశాలల దోపిడీపై కఠిన చర్యలు తీసుకుంటూ, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ (MEO), డిఈఓ (DEO) పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యా పరిపాలనను బలోపేతం చేయాలన్నారు.ముఖ్యంగా, రాష్ట్రంలో ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విద్యార్థుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ మాటలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల సంఖ్యను తగ్గిస్తే పేద విద్యార్థులకు చదువు దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నిరసన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర సంయుక్త కార్యదర్శి గౌతమ్, అరుణ్, సత్యలతో పాటు నగర ఉపాధ్యక్షులు సాయి తేజ, సిద్దు, రామ్ చరణ్, మారుతి, ప్రవీణ్, ఆయన్ తదితర ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థుల భాగస్వామ్యంతో కొనసాగింది.

