జమ్మికుంటలో వర్షాధార లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 22: జమ్మికుంట పట్టణ పరిధిలో ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి గాను హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి అంబేద్కర్ కాలనీ మీదుగా వచ్చే వరద నీటి కాలువలను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ పరిధిలోని మొత్తం 30 వార్డులలో వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా అన్ని రకాల నివారణ ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తమ పాలకవర్గం ఎల్లప్పుడూ అనునిత్యం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

