గ్రామ దేవతల ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి: వొడితల ప్రణవ్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 19: గ్రామ దేవతల ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ఊర్లను కాపాడే అమ్మవార్లు ప్రజల కోరికలను తీర్చి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆకాంక్షించారు. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి, భూ లక్ష్మి, నాభి శిల (బొడ్రాయి), పోచమ్మ తల్లి బోనాల మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ప్రణవ్ బాబుకు గ్రామస్థులు, మహిళలు మంగళహారతులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోచమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జగ్గయ్యపల్లి గ్రామంలో ఇటీవల నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేకంగా కృషి చేసిన వొడితల ప్రణవ్ను జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ మాజీ పాలకవర్గం, గ్రామ పెద్దలు , ప్రజలు శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ, జగ్గయ్యపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ బోనాల ఉత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు , పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

