జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీపై వరంగల్ జిల్లా విద్యాశాఖ కీలక ఆదేశాలు
వరంగల్,వి90 న్యూస్,జూన్ 19: వరంగల్ జిల్లాలోని గుర్తింపు పొందిన (అక్రిడిటెడ్), వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రంగయ్య నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సత్య శారద ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే – ఐజేయూ) వరంగల్ జిల్లా కమిటీ ప్రతినిధులు జర్నలిస్టుల పిల్లల చదువుల నిమిత్తం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు అందజేసిన వినతిపత్రాన్ని సానుకూలంగా పరిశీలించిన అనంతరం జిల్లా విద్యాశాఖ ఈ సాహసోపేత నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా డీఈఓ రంగయ్య నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామచందర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు కందుల శ్రీధర్ ఉన్నారు. వారితో పాటు యూనియన్ ఉపాధ్యక్షులు కూర్ణ వెంకటేశ్వర్లు, మహాదేవుని జగదీష్, సహాయ కార్యదర్శులు బొమ్మగాని సతీష్ కుమార్, బాదావత్ బాలాజీ, కమిటీ సభ్యులు ఎండి బాబర్, అక్రమ్, కందుల శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

